హౌసింగ్ అర్బన్ లే అవుట్ క్రింద ఒంగోలు నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. ఎస్.ది నేష్ కుమార్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే రైతుల నుండి మల్లేశ్వరపురం, ఎన్.అగ్రహారం, మరియు వెంగముక్కలపాలెం తదితర గ్రామాలలో భూమి సేకరించి రైతులకు నష్ట పరిహారాన్ని కూడా అందజేశామన్నారు. శనివారం ఆయన అగ్రహారం మరియు వెంగముక్కలపాలెంలో పట్టాల పంపిణీ కోసం ఈ భూములలో చేస్తున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ ఇళ్లపట్టాల కోసం 520 ఎకరాలను గుర్తించామని, వీటిలో ఇప్పటికే 435 ఎకరాలకు భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాలలో సుమారు 166 కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని జమ చేసినట్లు చెప్పారు. మల్లేశ్వరపురం, ఎన్. అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాలలోని ఈ భూములలో జంగిల్ క్లియరెన్స్, సర్వే పనులను చేపట్టామని చెప్పారు. ఈ లేఅవుట్లకు అప్రోచ్ రోడ్డు, డ్రైనేజీ సదుపాయలను ఏ విధంగా కల్పించాలనే విషయంపై ఓ.యు.డి.ఏ. మరియు అర్బన్ ఇంజినీర్లతో ప్రణాళిక రూపొందించామన్నారు. పంపిణీ కోసం ఇళ్ల పట్టాల ప్రింటింగ్ ఇప్పటికే పూర్తయిందని, రెండు మూడు రోజులలోనే వీరికి లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. అనంతరం వీరికి ప్లాట్ మ్యాపింగ్ చేసి ఆ వివరాలతో పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వచ్చే రెండు వారాలపాటు రెవెన్యూ, ఓ.యు.డి.ఏ., మున్సిపల్ అధికార యంత్రాంగంతో యుద్ధప్రాతిపదికన రాత్రింబవళ్లు ఈ స్థలాలలో జంగిల్ క్లియరెన్స్, స్టోన్స్ ప్లాంటేషన్, అంతర్గత రోడ్లు, ఇతర అవసరమైన పనులను కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వెంగముక్కలపాలెంలోనే పాత్రికేయులకు కూడా …
అర్హులైన జర్నలిస్ట్ ల కు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున వెంగముక్కలపాలెంలోని లేఅవుట్ పక్కనే వీరికి కూడా స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం అవసరమైన 7-8 ఎకరాల భూమిని గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, తహశీల్దార్ మురళి, ఇతర అధికారులు ఉన్నారు.



