పేదల సంక్షేమమే తన ధ్యేయమని వైసిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు. దర్శి మండల పరిధిలోని జముకులేదిన్నె, తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, చింతలపాలెం గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే వాలంటీరు వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలందరికీ మేలు కలుగుతుందన్నారు. వాలంటీరు వ్యవస్థను రద్దు చేసే కుట్రతో వాలంటీర్లు ద్వారా పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు వాలంటీరు వ్యవస్థ కావాలని చెబుతున్నట్లు తెలిపారు. పింఛను నగదు బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల వద్దులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తన తల్లి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ బొద్దికూరపాడు గ్రామంలో పుట్టిందన్నారు. తనకు దర్శిలో ఓటు ఉందన్నారు. నరసరావుపేట నుంచి వచ్చిన వారు తాము లోకల్ అని చెప్పటం సరికాదన్నారు. గత 20 సంవత్సరాలుగా తన తండ్రి, తన కుటుంబం దర్శి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బొద్ధికూరపాడులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నందినిలకు ప్రజలు స్వాగతం పలికారు. బోద్ధి కూరపాడు లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పుట్టినిల్లు కావడంతో అక్కడ స్థానిక మహిళలతో కలిసి బూచేపల్లి నందిని డాక్టర్ శివప్రసాద్ రెడ్డికి గుమ్మడికాయతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… బొద్దికూరపాడుపాడు ప్రజలు ఏ అవసరం వచ్చినా తాను అన్ని విధాలు అండగా ఉండి ఆదుకుంటానన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన పలువురు వైసిపిలో చేరారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ముందుగా ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజా ప్రతినిధులు , నాయకులు , కార్యకర్తలు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కి గజమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.









