కార్మికులు, వర్తకుల సమస్యల పరిష్కారం కోసం తలసాని శంకర్ యాదవ్ ఎనలేని సేవలు అందించారని పలువురు స్మరించుకున్నారు. బోయిన్ పల్లి మార్కెట్ వర్తకులు, కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ ఇటీవల మరణించగా, ఆయన జ్ఞాపకార్ధం శంకర్ యాదవ్ సోదరుడు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం బోయిన్ పల్లి మార్కెట్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శంకర్ యాదవ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్మికులకు అన్నివేళలా అండగా నిలిచిన శంకర్ యాదవ్ మరణం తమను తీవ్ర దుఃఖానికి గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మార్కెట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు గిరిధర్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు టీ ఎన్ శ్రీనివాస్, తలసాని శంకర్ యాదవ్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


