ఆటవిక జీవితాన్ని వదిలి మహర్షిగా ఎదిగిన వాల్మీకి సదా చిరస్మరణీయులని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖామాత్యులు డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం ప్రకాశం భవనంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్థనరావు అధ్యక్షతన జరిగిన వాల్మీకి జయంతి వేడుకలో కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత వాల్మీకి చిత్రపటానికి వీరు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతూ బి.సి.లకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ దిశగా ఆయా కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రజాసేవలో రాణించేలా రాజకీయంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బి.సి.లకు ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకువస్తున్నామని చెప్పారు. బి.సి.లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. మనిషి ప్రవర్తన ఏవిధంగా ఉండాలో, అధికారులు, పాలకులు ఏ విధంగా వ్యవహరించాలో వాల్మీకి తెలియజేశారని కొనియాడారు. ఆ విలువలను భావితరాలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఒంగోలులోని బాలికల హాస్టలు రెండో ఫ్లోర్ కూడా మంజూరు చేశామన్నారు.
గంగాడ సుజాత, నూక సాని బాలాజీ మాట్లాడుతూ ప్రతిభకు వెనుకబాటుతనం అడ్డుకాబోదని అన్నారు. బి.సి.ల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఆయా వర్గాలకు మంత్రి పదవుల కేటాయింపుతోపాటు రక్షణ చట్టం కూడా ఇందుకు నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు మాట్లాడుతూ.. నైతక విలువలకు, కుటుంబ బంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ రామాయణం రాసిన వాల్మీకిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బి.సి. వర్గాలకు అవసరమైన భవనాలను జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్మించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
బి.సి. సంఘాల నాయకులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణారావు, బంకా చిరంజీవి, సుధాకర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, తదితరులు మాట్లాడుతూ వాల్మీకి ప్రతిభను కొనియాడారు. బి.సి. ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో జిల్లా బి.సి. సంక్షేమ అధికారి అంజల, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాధరావు, దివ్యాంగుల సంక్షేమ అధికారి అర్చన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

