వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులు, అవసరాన్ని బట్టి అదనంగా సమకూర్చేందుకు తీసుకోవలసిన చర్యలపై సత్వరమే వాటర్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఆయా అంశాలపై శుక్రవారం ప్రకాశం భవనములోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి సమీక్షించారు.
గ్రామాలు, వార్డుల వారీగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించడంతో పాటు ఏప్రిల్ నెల వరకు ఎంత మేరకు నీరు అవసరమో వాటర్ ఆడిట్ నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. వచ్చే సోమ , మంగళవారాలలో సచివాలయ స్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఈ పని పూర్తిచేసేలా పర్యవేక్షణ చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. బుధ, గురువారాలలో మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ. లు, ఎం.పి.డీ.ఓ. లు వీటిని వెరిఫై చేయాలని కలెక్టర్ చెప్పారు. అనంతరం శుక్రవారం నాటికి తనకు నివేదించాలని ఆర్డబ్ల్యుఎస్
ఎస్.ఈ. బాలశంకర్ రావుకు స్పష్టం చేశారు. క్రాష్ కార్యక్రమంలో భాగంగా చేతి పంపుల మరమ్మతులు , సిపిడబ్ల్యూఎస్ పథకాల కింద అవసరమైన మరమతులపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. అవసరమైన విడిభాగాలను సమకూర్చుకునేందుకు టెండర్లను పిలవడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
**కలెక్టరేట్లో కాల్ సెంటర్**
తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రకాశం భవనంలో ప్రత్యేక కాల్ సెంటర్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ , పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని ఈ కాల్ సెంటర్లో విధులకు కేటాయించాలని చెప్పారు. కాగా, ఇందుకోసం 9100121605 నెంబరును కేటాయించినట్లు అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు తెలిపారు.
ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ , కనిగిరి ఇంచార్జ్ ఆర్డిఓ ఎం.వెంకట శివరామరెడ్డి, డిపిఓ వెంకట నాయుడు, జెడ్పి సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


