తాళ్లూరు మండలం, సోమవరప్పాడు తూర్పు గంగవరం గ్రామ పరిధిలో వెలసిన శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి 100 వ వార్షిక తిరునాళ్ళు సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లు, తిరునాళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, వాహనాల పార్కింగ్ స్థలాలు మరియు భక్తులు గుమిగూడే ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బందోబస్తు సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు ముఖ్యమైన సూచనలు చేశారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు కొరకు క్యూ లైన్లు పక్కగా నిర్వహించాలని, ఆలయం లోపల భక్తుల ప్రవేశం, మరలా తిరిగి వెళ్లే మార్గాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తక్షణమే స్పందించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.
జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ…. శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి 100 వ వార్షిక తిరునాళ్లుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో, వారి భద్రత మరియు సౌకర్యార్థం జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తుతో అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని, దర్శనంలో భక్తులు తోపులాటలు లేకుండా తీరునాళ్లు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. తిరునాళ్లు జరిగే ప్రాంతంలో సిసి కెమెరాల,డ్రోన్ కెమెరా నిఘా ఏర్పాటు చేసేమన్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ గుంటి గంగ భవాని అమ్మవారి దర్శించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. భక్తులు కూడా పోలీసుల సూచనలు పాటిస్తూ, తమ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు.
జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ వెంట దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి. రమణ కుమార్, దర్శి సీఐ రామారావు, తాళ్లూరు, దర్శి ఎస్ఐ లు మల్లికార్జున రావు, మురళి, ఎస్ఐలు మరియు సిబ్బంది ఉన్నారు.




