2025 -26 విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో నూరుశాతం విద్యార్థులను చేర్చే విధంగా కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమశాఖాధికారులు, వసతిగృహాల సంక్షేమాధికారులతో లక్ష్మానాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని వసతిగృహాల్లో ప్రభుత్వం కేటాయించిన సీట్లన్నీ భర్తీ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వసతిగృహాల సంక్షేమాధికారులు, వసతిగృహల్లో పనిచేసే నాలుగవ తరగతి ఉద్యోగులు వసతి గృహం పరిధిలోని గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. ఈ ఏడాది విడుదలైన ఇంటర్, పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను అభినందించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారు భవిష్యత్లో ఏ చదువులు చదవాలి, వారు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఎలాంటి కోర్సుల్లో చేరాలనే దిశగా విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలని ఆయన కోరారు. వసతిగృహాల్లో చదువుకుని ఇంటర్లో 900, పదవ తరగతిలో 500లకుపైగా మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో చేరే విధంగా సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారులు విద్యార్థులను చైతన్యం చేయాలని లక్ష్మానాయక్ కోరారు.


