టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడి పిరికి పంద చర్య అని రాష్ట్ర అసంఘటిత కార్మికుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కైపు వెంకటకృష్ణా రెడ్డి విమర్శించారు. స్థానిక గడియారం స్తంభం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ..దాడిలో 26 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయ పడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దాడిలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కేంద్ర, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దుర్ఘటన దేశంలో శాంతి భద్రతల వైపల్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు గాలికొదిలేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చే పనిలో హెూం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హెూంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శి నగర అధ్యక్షులు కాలేష, దర్శి మండల అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి, తాళ్లూరు మండల అధ్యక్షులు కూకట్ల వీరబ్రహ్మం, కురిచేడు మండల అధ్యక్షులు షేక్ మీరావలి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట రమణారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ప్రశాంత్,షేక్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

