హైదరాబాద్. మే 4 (జే ఎస్ డి ఎం న్యూస్) :
అవినీతిని ప్రోత్సహిస్తూ జిహెచ్ఎంసి ఆదాయానికి భారీగా గండి కొడుతున్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను దళిత చైతన్య సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పడి నవీన్ కుమార్ మాదిగ కోరారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను కలిసి అవినీతి సిబ్బంది,అధికారులపై లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినట్లు చెప్పారు.ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ పరిధిలోని బేగంపేట్ ,సికింద్రాబాద్ సర్కిల్ లలో అవినీతికి అంతే లేకుండా పోయిందని.. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది అవినీతి కారణంగా ఈ రెండు సర్కిల్లో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల వెలుస్తున్నాయని వివరించారు.సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో సీతాఫల్మండి, బౌద్ధ నగర్,మేట్టిగూడ, తార్నాక తో పాటు బేగంపేట్ సర్కిల్ పరిధి లోని బేగంపేట్,రాంగోపాల్ పేట్,మోండా ,బన్సీలాల్ పేట్ డివిజన్ లలో జిహెచ్ఎంసి అనుమతికి మించి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే వాటిపై చర్యలు తీసుకోనేందుకు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాల్సిన చైన్ మెన్ (మున్షి)లు నిర్మాణదారులు(బిల్డర్లు)వద్ద అందిన మేర దండుకుంటూ కోట్లు గడిస్తున్నారని. ఇలా జిహెచ్ఎంసి ఆదాయానికి భారీగా గండి కొడుతూ వారి సొంత ఆదాయాన్ని పెంచుకుంటున్నారని దీనికి కారణం ఒకే చోట ఏళ్ల తరబడి విధులు నిర్వహించడమేనని కమిషనర్ కు చెప్పినట్లు ముప్పిడి వివరించారు.అవినీతికి కారణమై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న చైన్ మెన్లను వెంటనే బదిలీ చేయాలని కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు.వెంటనే స్పందించిన కమీషనర్ వారం రోజుల్లో
పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు ముప్పిడి చెప్పారు.
