జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ప్రజలకు అవసరమైన సహాయం చేసేందుకు జిల్లా లో ప్రకాశం భవనంలో 1077 టోల్ ఫ్రీ నెంబరుతో ప్రత్యేక కంట్రోలు రూమును జిల్లా కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా ఏర్పాటు చేశారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం నుంచి 23వ తేదీ వరకు ఈ కేంద్రం నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇందుకోసం రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్. డబ్ల్యూ . ఎస్, పశుసంవర్ధక, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా కలెక్టరు కేటాయించారు. ప్రతి 12 గంటలకు ఒక టీము పనిచేసేలా రెండు బృందాలను ఆయా శాఖల సిబ్బందితో ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, భారత వాతావరణ శాఖలు చేసిన ముందస్తు హెచ్చరికల నేపధ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పర్యవేక్షించేందుకు ఈ కంట్రోల్ రూమును ఏర్పాటు చేసినట్లు కలెక్టరు తేలిపారు. ఈ టోల్ ఫ్రీ నెంబరుకు వచ్చే ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకుని ఆ వివరాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమన్వయంతో తక్షణమే స్పందించేలా ఇందులోని సిబ్బంది పని చేయాలని కలెక్టరు ఆదేశాలు జారీ చేసారు. వర్షాల కారణంగా మండల, డివిజన్ స్థాయి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు నిర్దేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, మండల, డివిజన్ ల స్తాయిలోను కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని చెప్పారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ప్రకాశం జిల్లాలో 444.8 మి.మీల వర్షపాతం నమోదు….
జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 444.8 మి.మీ ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 38 మండలాలకు గాను 30 మండలాలలో వర్షపాతం నమోదు అయినది. జిల్లా సరాసరి 11.7 మి.మీగా నమోదు కాగా అందులో అత్యధికంగా కొత్త పట్నం 56.4 మి.మీల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా దొనకొండ 1.8 మి.మీలుగా నమోదు అయినది.
