జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్దులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి
అన్నారు. ఒంగోలులోని జవహర నవోదయ విద్యాలయానికి సంబంధించి 79 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైనును గురువారం ఉదయం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడుతూ… జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్దులు ఎంతో కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలోని జవహర్ నవోదయ విద్యాలయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. 8 నెలల కిందట ఒంగోలులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ప్రత్యేకంగా నవోదయ విద్యాలయానికి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దీనితో నవోదయ విద్యార్దులకు నీటి సమస్య తీరుతుందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరలో ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ…విద్యార్దుల సౌకర్యార్దం చేపట్టిన ఈ పథకం పనులను యుద్దప్రాతిపదికన చేయడం జరిగిందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర రావు, కార్పొరేటర్ సురేష్, ప్రిన్సిపాల్ శివరామ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

