దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటి వివరాలను వెబ్ ల్యాండ్ లో అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన ఎండోమెంట్ ఆస్తుల పరిరక్షణకు సంబంధించి జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశమై దేవాదాయ శాఖ కు సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు, డేటా ను రెవెన్యూ వెబ్ ల్యాండ్ లో అప్ డేట్ చేయుటకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, దేవాదాయ శాఖ అధికారులు అజెండా లో పొందుపరచిన వివిధ దేవాలయాల ఆస్తులను సంబంధిత తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి తహసీల్దార్ పరిధిలో అవకాశం ఉంటే మ్యుటేషన్ లేదా పేరు మార్పు చేసి వెబ్ ల్యాండ్ లో నమోదు చేయాలని, తహసీల్దార్ పరిధిలో లేకపోతే సమగ్ర సమాచారంతో ప్రతిపాదనలను పై అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్, తహసీల్దార్లను ఆదేశించారు. దేవాదాయ శాఖ కు చెందిన ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్డిఓ లు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ పానకాల రావు, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.
