ప్రభుత్వ, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం (పి-4) పథకంలో భాగంగా పేదలకు సహాయం చేసేందుకు అవసరమైన ‘ మార్గదర్శ’కులను త్వరగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘ బంగారు కుటుంబాల ‘ కింద జిల్లాలో 74 వేలకు పైగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు వీటికి అవసరమైన సహాయం చేసేలా మార్గదర్శకులను గుర్తించేందుకు
ఆగస్టు 15వ తేదీ డెడ్ లైన్ కాబట్టి త్వరగా గుర్తించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో బంగారు కుటుంబాలుగా పేర్కొన్న వాటిలో పొందగోరే సహాయాన్ని నిర్దిష్టంగా గుర్తించాలని ఆమె చెప్పారు.
ఆ మేరకు మార్గదర్శకులను వాటితో అనుసంధానం చేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జిల్లా స్థాయితో పాటు మండల స్థాయి అధికారులను కూడా మార్గదర్శకులుగా కొన్ని కుటుంబాలకు అనుసంధానం చేసి ఆయా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేలా సంబంధిత హోదాలోని అధికారులు నిరంతరం పర్యవేక్షించేలా తాను ఆదేశాలు జారీ చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, బంగారు బాల్యం కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి గిరిధర్ శర్మ, ఇంచార్జ్ సిపిఓ స్వరూప రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

