జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా దర్యాప్తులో ఉన్న హత్య, పివో సి ఎస్ ఓ /రేప్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, పెండింగ్ లో ఉన్న కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ ఎన్ బి డబ్ల్యూ ఎస్
పై సీసీ టిఎన్ఎస్ ద్వారా సమీక్షించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణ, ఛార్జీషీటు దాఖలు మరియు పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీశారు. నేర నియంత్రణ, నేరాల ఛేదించుట, అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు శాంతి భద్రతలకు పరిరక్షణకు అధికారులకు పలు కీలక సూచనలు మరియు మెళకువలను తెలియజేసారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక కార్యచరణతో ప్రణాళికా బద్ధమైన చర్యలు తీసుకుంటూ, ప్రతి ఒక్క పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేసి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేలా కృషి చేయాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న కేసులలో సమగ్ర దర్యాప్తు చేసి, మహిళా సంబంధిత నేరాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట సమయం లోపల బాధితులకు న్యాయం అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
అపరిష్కృత కేసులు, హత్య, మహిళలపై జరిగే నేరాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కేసులు పరిష్కరించాలని, పోక్సో/రేప్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ప్రాపర్టీ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయా కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, అరెస్టులు, చార్జ్ షీట్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, పోక్సో మరియు రేప్ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలని ఆదేశించారు. స్కూల్లు మరియు కాలేజీలలో అవేర్నెస్ క్యాంపులు నిర్వహించాలని, పిల్లలకు బ్యాడ్ టచ్ మరియు గుడ్ టచ్ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రాపర్టీ నేరాల్లో నిందితులను పట్టుకోడానికి మరియు దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయుటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చెయ్యాలని, పాత నేరస్థులపై మరియు చెడునడతగల వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, విజిబుల్ పోలీసింగ్ చేస్తూ, నైట్ బీట్స్ బలోపేతం చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి కట్టడి చేయాలని తెలిపారు.
రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డ్స్, బారికేడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యాక్సిడెంట్ కు సంబంధించిన ఎఫ్ఏఆర్, ఐఏఆర్ & డీఏఆర్ రిపోర్ట్స్ ను నిర్ణీత కాలవ్యవధిలో గౌరవ. ఎంఏసీటీ కోర్ట్ కు పంపించాలని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేయాలన్నారు.
గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాలను రవాణా మరియు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు.
రానున్న లోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులను లిస్ట్ అవుట్ చేసి, ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు కృషి చెయ్యాలన్నారు.
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, అంకితభావంతో విధులు నిర్వహించాలని, సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. పోలీస్ సిబ్బంది నీట్ యూనిఫామ్ టర్న్ అవుట్ కలిగి ఉండాలన్నారు.
ఈ నేర సమీక్ష సమావేశంలో డిఎస్పి లు లక్ష్మీనారాయణ, నాగరాజు, రమణ కుమార్, డిసిఆర్బి సిఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


