మార్కాపురం పట్టణంలో శనివారం పర్యటించిన జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆకస్మికంగా బస్టాండును తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. బస్టాండ్ నుంచి ఎన్ని సర్వీసులు నడుపుతున్నారో అధికారులను అడిగి ఆరా తీశారు. ఈ క్రమంలో బస్టాండులోని ఒక షాపులో స్థానికంగా తయారైన తాగునీటి బాటిళ్లను అధిక రేటుకు విక్రయిస్తుండడాన్ని గుర్తించారు. ఎలాంటి ఎం.ఆర్.పీ. లేకుండా ఇష్టానుసారంగా విక్రయిస్తున్న స్థానికంగా తయారైన తినుబండారాల ప్యాకెట్లను కూడా ఆమె గమనించారు. షాపులో ధరల పట్టీ కూడా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను ఈ షాపును తనిఖీ చేసి లోపాలను సరి చేసుకోవాలని నోటీసు ఇచ్చినట్లు స్థానిక తహసిల్దార్ చిరంజీవి ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ షాపును క్లోజ్ చేయించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ధరల పట్టీ లేకపోయినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, కాంట్రాక్టు / అనుమతి లేకుండా షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలని వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రయాణికులకు సదుపాయాలు, సేవల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కూడా వారికి చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, ఇతర అధికారులు ఉన్నారు.

