రసాయనిక ఎరువుల వాడకం తగ్గిస్తే రైతులకు సాగు ఖర్చులు తగ్గుతాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.
బయో ఫెర్టిలైజర్స్, జీవ ఎరువుల వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను సోమవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలిసి ఆమె ప్రారంభించారు. బయో ఫెర్టిలైజర్స్, జీవ ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ… రసాయనిక ఎరువుల వాడకం వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతోందన్నారు. బయో ఫెర్టిలైజర్స్ వాడకం వల్ల నేల సారం మెరుగుపడుతుందున్నారు. రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందన్నారు. ఈ విషయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. రైతులకు అవసరమైన బయో ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా బయో ఫెర్టిలైజర్స్, జీవ ఎరువులు తయారు చేసే దోర్నాలకు చెందిన రైతు ఈదర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కషాయాలు, ఇతర ప్రకృతి ఆధారిత ఉత్పత్తుల వల్ల రైతులకు సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు.

