ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దేశించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని మీకోసం సమావేశ హాలు నందు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఎస్.డి.సీ లు వర కుమార్, శ్రీధర్ రెడ్డి, జాన్సన్, పార్ధసారధి, కుమార్ లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమం నకు సంబంధించి ఆన్ లైన్ లో వచ్చే అర్జీలను సంబంధిత శాఖల హెచ్.ఓ.డిలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్జీదారులకు నిర్ణీత గడువు లోగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రీ ఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


