అర్హులైన ప్రతీ రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ పధకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’ పధకం అమలుపై గురువారం సచివాలయం నుండి వివిధ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ…ఆగష్టు,2వ తేదీన ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’ కింద 3174. 4 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని 46 లక్షల 85 వేల 831 మంది రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’ పధకం మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయలు చొప్పున, కేంద్ర ప్రభుత్వం 2 వేల రూపాయలు చొప్పున మొత్తం 7 వేల రూపాయలను అర్హులైన రైతులకు అందించడం జరుగుతుందన్నారు. అర్హుడైన చివరి రైతు వరకు ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’ పధకంను వర్తింపచేయాలన్నారు. ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’ కార్యక్రమాన్ని జిల్లా, గ్రామ స్థాయిలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రజాప్రతినిధులను, రైతులను భాగస్వాములను చేయాలన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు , విత్తనాలు, ఎరువులు పంపిణీ, ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాయితీతో సాగులో యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, తదితర అంశాలను రైతులకు, ప్రజలకు తెలియజేయాలన్నారు. నీటి పరిరక్షణ, నీటి నిర్వహణ ప్రధానమైనదని, రాష్ట్రంలో ప్రస్తుతం సగటు వర్షపాతం తక్కువగా ఉన్నందున ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు కలెక్టర్లు సాగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మారుతున్న ప్రపంచపు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించడంతోపాటు రైతులు లాభపడేలా చూడాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు దర్శి తహసిల్దార్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ..దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామంలో జరగనున్న అన్నదాత సుఖీభవ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రారంభోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టడం జరుగుచున్నవని ముఖ్యమంత్రి గారికి వివరించారు. అలాగే జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు ‘అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్’ పధకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ వరలక్ష్మి, మెప్మా పీడీ శ్రీహరి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, డిపిఓ వెంకట నాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.

