ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని దర్శి, తూర్పు వీరాయపాలెంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద గుంటూరు రేంజ్ ఐ.జీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
తదనంతరం తూర్పు వీరాయపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొని, పర్యటనను ముగించి బయలుదేరారు. పర్యటనకు ముందు, హెలిప్యాడ్, వి.ఐ.పి. రూట్, ప్రజావేదిక ప్రదేశం మరియు పార్కింగ్ ప్రాంతాలను గుంటూరు రేంజ్ ఐ.జీ మరియు జిల్లా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సిసిటివి కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా ప్రజావేదిక, హెలిప్యాడ్ మరియు ప్రధాన మార్గాలపై నిఘా ఉంచాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. బందోబస్తు విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రజా వేదిక, రూట్ మరియు ట్రాఫిక్, బందోబస్తు అధికారులు మరియు మహిళా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకుని విధులను నిర్వర్తిస్తే, ఏ కార్యక్రమం అయిన విజయవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమైందని తెలిపారు. పర్యటనను విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేసి, అలాగే సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.




