రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ దిశగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోయే అవకాశం ఉన్న పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళలు, గర్భిణులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె చెప్పారు.
స్థానికంగా ఉన్న కాలువలు, వాగులు, వంకలు, ఇతర నీటి వనరులు ఉదృతంగా ప్రవహిస్తున్న చోట అటువైపుగా వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వీఆర్ఏ, వీఆర్వోలను ఆయా ప్రాంతాలలో కాపలాగా ఉంచాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేలా అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైనా, సహాయం అవసరమైనా ప్రజలు వెంటనే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా కలెక్టరేట్లో 1077
టోల్ ఫ్రీ నంబరుతో ఈనెల 16వ తేదీ వరకు 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశారు. రెవిన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఈ కంట్రోల్ రూములో షిఫ్టులు వారీగా పని చేసేలా విధులను కేటాయించారు. ఇదేవిధంగా మండల, డివిజన్ల స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
