హైదరాబాద్ డిసెంబర్ 31
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతరం కృషిచేస్తూ వినూత్న రీతుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ ముందుకు సాగుతున్న సర్వేజనా ఫౌండేషన్ నూతన సంవత్సరం సందర్భంగా వాహనదారుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు 116 శతక పద్యాలతో రచించిన “బండి శతకం” పుస్తకాన్ని సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి ఆవిష్కరించారు. బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఈ పుస్తకావిష్కరణ చేశారు. ప్రముఖ హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా స్పీడ్గా వెళ్లడం వల్ల ప్రమాదాలు అనే అంశంపై 116 పద్యాలతో సామాజిక సందేశాన్ని ఇచ్చే విధంగా రూపొందించిన బండి శతకం పుస్తకం రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడికి అందేలా చేస్తామని గురవారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సర్వేజనా ఫౌండేషన్ సీఈఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి. జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ గంభీరమైన అంశాలకు హాస్యం జోడించి మనస్సులను మార్చే ప్రక్రియలో భాగమే పుస్తక రూపమని తెలిపారు. వందలాది మంది వందలాది పద్దతుల్లో చెప్పినప్పటికి యాక్సిడెంట్లకు గురవుతూనే ఉన్నారు, 116 పద్యరూపకంగా చెప్తే ప్రజల్లో మార్పు వస్తుందనే చిన్న ప్రయత్నమన్నారు. చండీ యాగం లాంటి బండీ యాగాన్ని నిర్వహిస్తున్న గురవారెడ్డి వైద్యరంగంలో, హాస్య రంగంలో ప్రత్యేకత ఉందని, ఈ పుస్తకావిష్కరణ నా జీవితంలో గర్వకారణమైన, సర్వకారణమైన రోజని పుస్తక రచయిత హాజ్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుషాల్, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాం ఎలమంచిలి, ఫౌండేషన్ సీఓఓ ప్రవీణ్, ఎస్ వి పి మెంబర్ రాం మంజేరి తదితరులు పాల్గొన్నారు.
