సికింద్రాబాద్, మార్చి 28
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అంగన్వాడీ కేంద్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక దృష్టి
సారిస్తున్నారు. ఇందులో భాగంగా సనత్నగర్ అసెంబ్లీ పరిధిలోని బేగంపేట్ డివిజన్ భగవంత్పూర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుదలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పిల్లల కోసం బెంచీలు, టేబుళ్లు, కిచెన్ సదుపాయాల అభివృద్ధి, ప్లేట్లు, గ్లాసులు, విద్యా సామగ్రి, ఆటబొమ్మలు, పుస్తకాలు వంటి అవసరమైన వస్తువులు అందించడంపై చర్యలు చేపట్టారు. అలాగే పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన కిట్లు, గర్భిణీలు మరియు బాలింతల కోసం ప్రత్యేక కిట్లు అందించడాన్ని ప్రోత్సహిస్తున్నారు.
అదనంగా, తాగునీటి సదుపాయం, శౌచాలయాలు, విద్యుత్ లైటింగ్ వంటి ప్రాథమిక వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆరోగ్య సిబ్బందితో సమన్వయం పెంచుతూ పోషణాభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నారు.
పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్యల ద్వారా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బిజెపి అధ్యక్షులు గుండుగోని భరత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు), మాజీ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, అశోక్ యాదవ్, విజిలాల్, తారకంపేట్ శ్రవణ్ కుమార్ , వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


