హైదరాబాద్, మే 11,
(జే ఎస్ డి ఎం న్యూస్) :మన దేశంలో చాలామందిని ప్రభావితం చేస్తున్న సిస్టమెటిక్ లూపస్ ఎరిథమటోసస్ (ఎస్.ఎల్.ఈ.) వ్యాధి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించారు. సరైన సమయానికి చికిత్స తీసుకుంటే దీని లక్షణాలన్నింటి నుంచి ఉపశమనం లభిస్తుందని, అదే సమయంలో చికిత్సకు నిర్లక్ష్యం చేసినా, వైద్యుల వద్దకు వెళ్లడానికి ఆలస్యం చేసినా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ లూపస్ డే సందర్భంగా సోమవారం కిమ్స్ ఆస్పత్రిలో లూపస్ వ్యాధితో పోరాడుతున్న వారితో వినూత్నంగా ర్యాంప్ వాక్ నిర్వహించారు. సుమారు 40 మంది యోధులు ర్యాంప్ వాక్ చేసి, తమ ఆత్మవిశ్వాసాన్ని, వ్యాధిని జయించగలమన్న నమ్మకాన్ని ప్రదర్శించారు. దాదాపు వంద కుటుంబాలకు చెందిన పలువురు, నగరానికి చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసియాలోనే ఇలా ర్యాంప్ వాక్ నిర్వ హించడం ఇది ఐదోసారి. సికింద్రాబాద్ కిమ్స్ఆస్పత్రిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి ఆలోచనల ఫలితంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు లూపస్ ఉందని చెప్పుకోవడానికే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. దాని నుంచి ఇప్పుడు పోరాడే మహిళగా నేరుగా ఆస్పత్రికి వచ్చి ఇక్కడ ర్యాంపుపై మోడళ్లలా ర్యాంప్ వాక్ చేసే స్థాయికి రావడానికి వైద్యులు ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణం .ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్ర మౌళి మాట్లాడుతూ మన దేశంలో లూపస్ ఎక్కువగానే ఉన్నా, ఎంతమందికి వస్తోందన్న అధికారిక లెక్కలు లేవు. మా వద్దకు రోజూ వచ్చే సుమారు 100-120 మందిలో 20-25 మంది లూపస్ వ్యాధితో పోరాడే వారే ఉంటున్నారు. ప్రాంతాల వారీగా ఇది వేర్వేరుగా ఉంటోంది. పాశ్చాత్య దేశాల్లో ప్రతి లక్ష మందిలో 20-150 మందికి ఇది ఉంటోంది. ఈ లెక్కలు అక్కడ పక్కాగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో లూపస్ సమస్యలు వచ్చినా, అవగాహన రాహిత్యం, అందుబాటులో రుమటాలజిస్టులు లేకపోవడంతో గుర్తించలేకపోతున్నారు. ఇక ఈ వ్యాధితో పోరాడుతున్న వాల్లో 90% మంది మహిళలే ఉండడం మరో బాధాకరమైన విషయం. సాధారణంగా 15-45 ఏళ్ల మధ్య వయసు (పునరుత్పత్తి దశ)లోనే ఇది వస్తుంది. ఈ సమస్య గురించి ఇటు సామాన్య ప్రజలతో పాటు వైద్యుల్లోనూ అవగాహన అంతగా లేకపోవడంతో వ్యాధి వచ్చిన తర్వాత రుమటాలజిస్టు వద్దకు వెళ్లడానికి దాదాపు మూడేళ్లకు పైగా పడుతోంది.
లూపస్ శరీరంలో ఏ భాగాన్నైనాప్రభావితం చేయొచ్చు. చాలాసార్లు అసలు దాని గురించి తెలియదు కూడా. ఇది ఒక దీర్ఘకాలిక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. ఇందులో మన రోగనిరోధక శక్తి అతిగా క్రియాశీలకం అయిపోయి, సాధారణ కణజాలాలపై దాడిచేస్తుంది. దీనివల్ల కొందరికి చర్మం మీద దద్దుర్లు రావడం, జుట్టు ఊడిపోవడం, నోట్లో పుండ్లు పడటం, కీళ్ల వాపులు, నొప్పి తీవ్రంగా అనుభవించండం, జ్వరం లాంటివి రావచ్చు. ఇది ఊపిరితిత్తులు,మూత్రపిండాలు, గుండె, మెదడు, నరాలు, చర్మం, రక్తం.. ఇలాదేన్నయినా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో 20వేల మంది వరకు రుమటాలజిస్టులు అవసరం ఉండగా, కేవలం 800 మంది మాత్రమే అందుబాటులో ఉండడం కూడా దీని చికిత్స సరిగా అందకపోవడానికి కొంత కారణం అవుతోంది.
లూపస్ వచ్చిందని గుర్తించడం ఎలా.
విపరీతమైన నీరసం, అలసట, జ్వరం, బరువు తగ్గడం, శరీరంపై దద్దుర్లు, ఎండలో వెళ్లినప్పుడు ముఖంపై ఎర్రగా దద్దుర్లు రావడం, జుట్టు రాలడం, ఆర్థరైటిస్, మూత్రంలో ప్రోటీన్ పోవడం, మూత్రంలో రక్తం పడడం, త్వరగా మర్చిపోవడం, రక్తహీనత, తెల్ల రక్తకణాలు లేదా ప్లేట్లెట్లు తగ్గడం, తరచు గర్భస్రావాలు కావడం, లేదా తరచు నోట్లో పుళ్లు రావడం ఇవన్నీ కూడా లూపస్ లక్షణాలే. ఇలాంటి లక్షణాలు కనిపించిన తొలిదశలోనే రుమటాలజిస్టును సంప్రదిస్తే.. దీన్ని పూర్తిగా నయం చేయగలం కూడా. అయితే చాలామంది ఈ లక్షణాలను ఇతర సమస్యలుగా భావించి, రెండు మూడేళ్ల తర్వాత గానీ రుమటాలజిస్టులను సంప్రదించడం లేదు. దాంతో ఇది కొన్నిసార్లు
ప్రాణాపాయానికి దారితీస్తోంది. సరైన చికిత్స పొందకపోతే ఆయుష్షు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. అయితే, ఆధునిక వైద్యవిధానాల్లో లూపస్ రోగులకు అత్యుత్తమ చికిత్స అందుబాటులో ఉంటోంది. తగిన అవగాహన కల్పించగలిగితే చాలామంది రోగులు త్వరగా ఈ సమస్యను గుర్తించి, తగిన చికిత్స పొంది, ఆరోగ్యకరంగా జీవించగలరు. అని డాక్టర్ శరత్ చంద్ర మౌళి తెలిపారు.






