హైదరాబాద్, ఆగస్టు 3, (జే ఎస్ డి ఎం న్యూస్) :
అవయవ దానం ద్వారా ఒక వ్యక్తి మరణానంతరం కూడా పలువురికి జీవంప్రసాదించగలడని, సమాజంలో అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు విస్తృత అవగాహన అవసరమని అన్నారు వక్తలు. జాతీయ స్థాయి అవయవ దాన అవగాహన కార్యక్రమం “అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్”లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్), కిమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది. “అవయవ దానం – ప్రాణదానం చేయండి,మానవత్వపువారసత్వాన్ని నిలబెట్టండి” అనే థీమ్తోనిర్వహించిన కార్యక్రమానికి వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు,అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కిమ్స్ మెడికల్ ఎడ్యూకేషన్ (అకాడెమిక్స్) డైరెక్టర్ డా. ఎస్. మణిమాల రావు మాట్లాడుతూ అవయవ దానం అనేది మానవతా సేవలోఅత్యున్నతమైన కార్యమని, సమాజంలో ప్రతి కుటుంబం ఈ విషయంపై చర్చించాల్సిన అవసరంఉందన్నారు. మరణానంతరం అవయవ దానం చేయాలనే సంకల్పం ఎన్నో కుటుంబాలకు కొత్త ఆశను
ఇస్తుందని చెప్పారు.
గుండె,ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డా. సందీప్ అట్టావర్
మాట్లాడుతూ బ్రెయిన్ డెత్ అనంతరం జరిగే అవయవ దానం ద్వారా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం,మూత్రపిండాలు వంటి కీలక అవయవాలను అవసరమైన రోగులకు మార్పిడి చేసి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. ఒక అవయవ దాత ఎనిమిది మందికి ప్రాణదానం చేయడంతో పాటు 50 మందికి పైగా జీవన నాణ్యతను మెరుగుపరచగలడని తెలిపారు.కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ డాక్టర్. సహారియా, డాక్టర్. ఉమమహేశ్వరరావులు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవయవాల మార్పిడిపై అవగాహ వస్తోందని, ఇంకా మరింతగా ఈ అవగాహన రావాలన్నారు. అవయవాల మార్పిడితో జీవన నాణ్యతపెరుగుతుందన్నారు.యువతలో అవయవ దానంపై సానుకూల దృక్పథం పెంపొందించేందుకు విద్యాసంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ సీఓఓ డా. సౌరబ్ లాల్ మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు సమాజంలో అవయవ దాన సందేశాన్ని తీసుకెళ్లే రాయబారులుగా పనిచేయాలని సూచించారు. ఆర్గాన్ డోనేషన్ మరియు కెడవార్ ట్రాన్స్ ప్లాంట్ సర్వీస్ ప్రెసిడెంట్ కె మంగాదేవి ఆధ్వర్యంలో అవయవదానం చేసిన వారికి, ఆయా కుటుంబ సభ్యులకు సత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో అవయవ దాన ప్రాముఖ్యత, దాత నమోదు విధానం, బ్రెయిన్ డెత్ అనంతరం అనుసరించే వైద్య ప్రక్రియలపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు అవయవ దాన ప్రతిజ్ఞ చేసి అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు డా. హారిణి చెబ్రోలు మరియు అధ్యపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా నిర్వాహకులు మాట్లాడుతూ “అవయవ దానం మహాదానం… ఒక నిర్ణయం ఎన్నో ప్రాణాలను కాపాడగలదు” అనే సందేశాన్ని ప్రతి కుటుంబం చేరవేయాలని కోరారు.
