వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సతీసమేతంగా పాల్గొన్నారు. ప్రకాశం మార్కాపురం జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మరియు మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకునే పండగ వినాయక చవితి అని, ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు క్షేమ, ధైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని చేపట్టిన పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భక్తి భావం, సామరస్యం, ఐకమత్యం, ఆనందోత్సాహల మధ్య వినాయక చవితి పండుగ, గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని, పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు జరిగే పూజలు, వేడుకల, ఊరేగింపులు సందర్భాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిర్వహించుకోవాలని సూచించారు. పూజా కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ఎస్పీ పెన్నులు పంపిణీ చేశారు.
జిల్లాలో వినాయక మండప నిర్వాహకులు పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని, ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు లేదా డయల్ 112/100 ద్వారా సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డిటిసి డిఎస్పి గురునాధ్ బాబు, ఆర్ఐలు రమణరెడ్డి, సీతారామి రెడ్డి, రవికుమార్, ఆర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




