తాళ్లూరు మండలం, గంగవరం సమీపంలోని గుంటిగంగ వద్ద మాల అన్నదాన సత్రం నిర్మించేందుకు 50 సెంట్ల భూమిని కేటాయించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తరలివచ్చిన పెద్దలు, యువకులు మంగళవారం దర్శి కి వచ్చి ఎమ్మెల్యేను కలిశారు.
ఈ సందర్భంగా దారా అంజయ్య ఎమ్మెల్యే వేణుగోపాల్ తో మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గం లోని మాల కులస్తుల్లో 95 శాతానికి పైగానే ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారని తెలిపారు. గుంటి గంగమ్మ దేవస్థానం వద్ద అనేక కులాలకు సంబంధించిన అన్నదాన సత్రాలు నిర్మించారన్నారు. మాల కులస్తులు అన్నదానం సత్రం లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు మాలలను మోసగించి సత్రం నిర్మించేందుకు భూమి కేటాయించలేదన్నారు. మాలలు తన మేనమామలు అని చెప్పుకున్న వైయస్ జగన్ ప్రభుత్వంలోనైనా మీ ఆధ్వర్యంలో మాలల అన్నదాన సత్రానికి శంకుస్థాపన జరగాలని అంజయ్య కోరారు. దీంతో స్పందించిన శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ మాల కులస్తులకు గుంటి గంగ వద్ద అన్నదాన సత్రం నిర్మించుకునేందుకు 50 సెంట్లు స్థలాన్ని కేటాయించాలని ఫోన్ చేసి చెప్పారు. మాల కులస్తులకు ఎలాంటి కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా తనను వచ్చి కలవచ్చని వేణుగోపాల్ తెలిపారు. దీంతో అక్కడికి వచ్చిన మాల పెద్దలు, యువకులు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలల అన్నదాన సత్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మాల పెద్ద చీదర్ల వెంకటేశ్వర్లుతో పాటు, ఇతర పెద్దలు, కూకట్ల శ్రీనివాసరావు, కొప్పుల బాలకోటయ్య, సర్పంచ్ వెంకటేశ్వర్లు, కూడల ఎలమంద, గోపనబోయిన హనుమంతరావు, లింగాలపాడు శ్రీను, లింగాలపాడు కోటేశ్వరరావు, ఆబోతు కోటేశ్వరరావు, సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.
గుంటి గంగ దేవస్థానం వద్ద మాల అన్నదాన సత్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలి- దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు మాల మహానాడు అధ్యక్షులు దారా అంజయ్య వినతి
29
Mar