చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల (ఎస్.డబ్ల్యు.పి.సి) నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అభివృద్ధి సంబంధిత పనులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ …ఎస్.డబ్ల్యు.పి.పి. షేడ్ ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వీటికి సత్వరమే బిల్లులను కూడా చెల్లిస్తున్నందువ పనులలో వేగం పెరిగేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రారంభంకాని గ్రామాలలో వీటి నిర్మాణాలకు అవసరమైన స్థలాలను, కాంట్రాక్టు సంస్థలను వారం లోగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసేలా చూడాలని అన్నారు. తడి, పొడి చెత్తను ఇళ్ల వద్దే వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ఈ విధంగా వేరు చేస్తున్న వివరాలను (డేటా) ప్రతి రోజూ సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో వేసిన లేఅవుట్లకు అవసరమైన అనుమతులు ఉన్నాయో, లేవో సెప్టెంబరు 15 నాటికి తనకు నివేదించాలని స్పష్టం చేశారు.
జల జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో చీమకుర్తి వెనుకబడి ఉండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జలశక్తి అభియాన్ పనులను కూడా వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ముగింపు దశలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్య భవనాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి సంబంధిత శాఖలకు అప్పగించాలని పంచాయతీరాజ్ అధికారులకు గడువు విధించారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడు వాటి పూర్వ విద్యార్థుల సహకారం కూడా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. “మన బడి-మన బాధ్యత” కార్యక్రమంలో పూర్వ విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని ఎం.ఈ.ఓ.లకు దిశా నిర్దేశం చేశారు. అంగన్ వాడీలలో హాజరును ప్రతి రోజూ పరిశీలించాలని, నమోదైన పిల్లలందరూ కచ్చితంగా అంగన్వాడీలకు వచ్చేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలోనూ
బాల్య వివాహాలు జరగరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి బాల్య వివాహాల వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, చట్టపరంగా ఎదుర్కోవలసిన శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు.
సమావేశంలో డి.పి.ఓ. నారాయణ రెడ్డి, డ్వామా పి.డి. శ్రీనారెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. కొండయ్య, డి.ఈ.ఓ. వి.ఎస్. సుబ్బారావు, సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఏ. మరియు మెప్మా పి.డి. రవికుమార్, మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, డి.ఎస్.ఓ. ఉదయ భాస్కర్, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురి, ఓ.యు.డి.ఏ. వి.సి. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గ్లోరియా, తదితర అధికారులు పాల్గొన్నారు.
పనులు త్వరితగతిన పూర్తయ్యాలా చూడాలి – పలు శాఖల పనితీరుపై మండల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ – పలు శాఖలకు దిశా నిర్దేశం
22
Aug