జిల్లా స్థాయి అధికారయంత్రాంగం ప్రజలకు మరింత చేరువ అయ్యేలా “జగనన్నకు చెబుదాం” (జె.కె.సి.) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ చెప్పారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో ప్రత్యేకంగా జె.కె.సి. కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా తొలుత ఒంగోలు మండలానికి సంబంధించిన జె.కె.సి. కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని స్పందన హాలులో శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికార యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేసేలా ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రాలలో ప్రత్యేక స్పందన (జె.కె.సి.) కార్యక్రమాలునిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాలను మరింత క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా మండల స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని 38 మండలాలలోనూ జె.కె.సి. నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. సెప్టెంబరు 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు ప్రతి బుధ మరియు శుక్ర వారాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి సోమవారం జరుగుతున్న స్పందన కార్యక్రమాలు కూడా యధావిధిగానే కొనసాగుతాయని చెప్పారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారం కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చెప్పారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా సహేతుకంగా పరిష్కరించి అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పిటిషన్లు పరిష్కారమవుతున్న తీరుపై ప్రతి శాఖలోనూ వారానికి ఒక సారి ఆడిట్ నిర్వహించి తనకు నివేదిక ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారుల పై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
