ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీ నగర్ కి వెళ్లే రహదారి గోతులమయం కావడంతో ప్రయాణికులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉల్లగల్లు నుండి లక్ష్మీ నగర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నది. గతంలో నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా గ్రామానికి వచ్చిన నేపథ్యంలో నాడు తారు రోడ్డుగా మార్పు చేశారు. అయితే గత సంవత్సర కాలంగా ఇదే రోడ్డులో పలుచోట్ల తీవ్ర గోతులై ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్లో చెరువు అలుగు ప్రాంతంలో వేసిన బ్రిడ్జి సైతం గుంతల మయం అయ్యి వెళ్లే దానికి వీలు లేకుండా తయారైంది. ముఖ్యంగా ఉల్లగల్లునుండి లక్ష్మీ నగర్, తూర్పు వీరాయపాలెం మీదుగా చీమకుర్తి వెళ్ళుటకు ఈ మార్గం దగ్గరగా ఉండడంతో అధిక సంఖ్యలో వాహనదారులు ఈ రోడ్డును వినియోగిస్తుంటారు. ఇదే కోవలో చీమకుర్తి
నుండి వినుకొండ వెళ్లే భారీ కంకర టిప్పర్లు సైతం ఈ రోడ్డులో వెళ్లడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్లో తూర్పు వీరాయపాలెం వద్ద వాగులో ఏర్పాటు చేసిన బ్రిడ్జిని అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు ఆటంకం కలిగింది. ఆ భూమి యజమాని కోర్టుకు వెళ్లడంతో గత ఏడు సంవత్సరాల నుండి ఆ బ్రిడ్జి నిరుపయోగంగా మారింది. దీంతో వీరాయపాలెం వైపు వెళ్లే వాహనదారులు పాత దారిని ఉపయోగిస్తూ ప్రమాదాలకు గురువుతున్నారు. ఇక కార్లు , ద్విచక్ర వాహనదారులు అవస్థలు వర్ణాతీతం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఉల్లగల్లో లక్ష్మీ నగర్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా తూర్పు వీరాయపాలెం వైపు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజల కోరుతున్నారు.
