గుంటూరు నగరంలోని సచివాలయాల్లో
విధులు నిర్వహిస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా నగర మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడుకి విన్నవించారు. ఈ మేరకు మంగళవారం సమితి సభ్యులు మేయర్ నబీ ఆయన చాంబర్ లో కలిసి సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, ఆ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. …గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వార్డు సచివాలయాలలో వివిధ హోదాలలో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగులు విధుల నిర్వ హణలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కొన్ని సచివాలయాలు అపార్ట్మెంట్స్ లో ఉండటం వలన మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తగిన చొరవ తీసుకోవాలన్నారు. స్పందించిన మేయర్ మాట్లాడుతూ …నగరంలో వార్డు సచివాలయాల వారీగా మొదటి, రెండవ అంతస్తులలో ఉన్న సచివాలయాలను పరిశీలించి దివ్యాంగ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేయర్ ను కలిసిన వారిలో సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు ధూపాటి రమణయ్య తదితరులు ఉన్నారు.
