సమాజంలోని దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ది సాధ్యమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా చెప్పారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ' సుగమ్య భారత్ యాత్ర 'ను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ తో పాటు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులు, జిల్లా అధికారులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ . తమీమ్ అన్సారియా
మాట్లాడుతూ…. విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్-2 యాప్ ను తీసుకువచ్చిందన్నారు. పని ప్రదేశాలు, ఇతర ప్రాంతాల్లో దివ్యాంగులకు ఎదురవుతున్న సమస్యలను ఇందులో అప్ లోడ్ చేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని ఆమె చెప్పారు.
రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ… దివ్యాంగులకు అవరోధరహిత మార్గం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సుగమ్య భారత్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దివ్యాంగులకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి వారికి కూడా అన్నింటా సమాన అవకాశాలు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్రస్దాయి సుగమ్య భారత్ యాత్రను ఒంగోలులో నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ర్యాలీలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జి.అర్చన, జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు, జెడ్పి సిఈఓ చిరంజీవి, ఆర్ అండ్ బి ఎస్.ఈ. దేవానంద్, డి.ఎం. హెచ్. ఓ . వెంకటేశ్వర్లు, మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి , డి.ఆర్.బి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ టి. రవికుమార్, డీ.ఎస్.వో. పద్మశ్రీ, డి. సి. హెచ్. ఎస్. సూరిబాబు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర , హౌసింగ్ పి.డి . శ్రీనివాస ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


