బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అమరజీవి శ్రీ. పొట్టి శ్రీరాములు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమాత్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి
అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని సి.వి.ఎన్. రీడింగు రూము సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయకుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్ కూడా అమరజీవికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ……తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆత్మ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధునిగా కూడా ఆయన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ…. తెలుగు ప్రజల కోసం, దేశం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేని దన్నారు. మేయర్ మాట్లాడుతూ ….దేశానికి స్వాతంత్ర్యంతో పాటు దళితులకు ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు. సంతనూతలపాడు శాసనసభ్యులు మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు త్యాగమే నాంది అని అన్నారు. పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ ….పోరాట పటిమకు, కార్యదీక్షకు ప్రతిబింబముగా నిలిచిన పొట్టి శ్రీరాములును యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి అంజల, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, బి.సి. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్టీవో లక్ష్మీ ప్రసన్న, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ వాసు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్తక సంఘాల నేతలు పాల్గొన్నారు.


