తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఆర్ .డబ్ల్యు . ఎస్. అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, సిబ్బందిని ఆమె ఆదేశించారు. అవసరమైన ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. అవసరమైన మోటార్ల మరమ్మతులు, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆయా విషయాల్లో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అలా కాకుండా అవసరం లేని చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్లు తన దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వివరాలను ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ప్రత్యేక యాప్ లో మాత్రమే నమోదు చేయాలని చెప్పారు. అలా విరుద్ధంగా నోట్ క్యామ్ లో నమోదు చేస్తే అందుకు బాధ్యులైన అధికారులే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య ఉందని ప్రజలు కాల్ సెంటరుకుగానీ, అధికారులకుకానీ ఫోన్ చేస్తే వారితో దురుసుగా ప్రవర్తించినట్లు గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. స్థానికంగా ఉన్న పైప్ లైన్ల మరమ్మతుల పనుల పురోగతిపై ఈ సందర్భంగా ఆమె ఆరా తీశారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ . ఎస్.ఈ. బాల శంకరరావు, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. శ్రీనివాస సంజయ్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ .డబ్ల్యు. ఎస్.ఈ. ఈ. లు, డి.ఈ. ఈ లు , ఏ.ఈ. ఈ. లు, ఇతర అధికారులు పాల్గొన్నారు .

