జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ -2025 ను మంగళవారం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ క్యాంపు లో భాగంగా మొదట జిల్లా ఎస్పీ ఫుట్ బాల్ ప్రారంభించారు. పిల్లలతో కాసేపు టాగ్ వార్ ఆడి అలరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ… పిల్లలకు మానసిక ఉల్లాసం, క్రీడల ఆసక్తితో పాటుగా వివిధ క్రీడల పట్ల నైపుణ్యతపెంపొందించేందుకు ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ లో ఈ క్యాంపును నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం మే 6 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 6.30 నుండి 8.30 వరకు అలాగే సాయంత్రం 4.30 నుండి 6.30 వరకు(ఎండ త్రీవత బట్టి సమయం మారవచ్చు) చాల రకాల ఆటలు జరుగుతాయని, ఈ సమ్మర్ క్యాంప్ లో పాల్గొనేందుకు పోలీస్ పిల్లలు మరియు ఇతర విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన మరియు ఉత్సాహభరితమైన అనుభవాన్ని అందించడానికి ఈ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగిందని, ఆటలు మరియు క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి శారీరక మరియు మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి అని, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మరియు ఓటమిని స్వీకరించే గుణం వంటి ఎన్నో విలువైన విషయాలను క్రీడల ద్వారా నేర్చుకోవచ్చునని మరియు కొత్త స్నేహితులను పొందవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రణాళిక ప్రకారం తమకు నచ్చిన ఆటల్లో నేర్పరులుగా తయారయ్యేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంపులను వినియోగించుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతలను వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారిని ఆ దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని, క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం చేకూరుతుందన్నారు. పోలీసు కుటుంబాలలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమ్మర్ క్యాంపులో ఫుట్ బాల్, టగ్ అఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, రన్నింగ్, యోగ మరియు ఇతర క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాంపు హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర పోలీస్ చిల్డ్రన్స్ కమిటీ ప్రెసిడెంట్ మరియు వివిధ రంగాలలోని నేషనల్ క్రీడాకారులు పిల్లలకు కోచింగ్ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సైలు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.



