వైశాఖ శుద్ధ సప్తమి మే 19వ తేదీ సోమవారం ఉదయం శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రము జరిగినది. అల్పపీడన ద్రోణితో జోరున వర్షం పడుచున్నా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీగిరి గిరి ప్రదక్షిణను కొనసాగించారు. తొలుత శ్రీగిరి పాదపీఠం వద్దగల శ్రీ బాపూజీ గో సంరక్షణ శాల (గోశాల) లో గోపూజ నిర్వహించి తులసి, గన్నేరు, మందార, మల్లెల మాలలచే శోభాయమానంగా అలంకరించిన పల్లకిపై శ్రీ శ్రీనివాసుని స్థిరపరిచి భక్తులు ఆనందపరవశ్యముతో గోవింద నామాలు చదువుతూ తమ భుజస్కందాలపై పల్లకిని మోస్తూ స్థానిక కోర్టు సెంటర్, జిల్లా కేంద్ర గ్రంథాలయం, కేశవ స్వామి పేట, భగీరథ మహర్షి సెంటర్, వేప అంకమ్మ తల్లి ఆలయం శర్మ కాలేజీ క్రికెట్ గ్రౌండ్ గద్దలగుంట, రాజా పానగల్ రోడ్డు మీదుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైయున్న శ్రీగిరి చేరి శ్రీవారిని దర్శించి దర్శించి తదాత్మ్యం చెందారు.
శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన వైశాఖమాసం ను మాధవ మాసంగా పిలుస్తారని, ఈ మాసంలో ఎందరో మహానుభావులు జన్మించారని, అత్యంత శుభప్రదమైన ఆది శంకరాచార్య జయంతి, శ్రీ రామానుజ జయంతి, మృకండ మహర్షి జయంతి, సీతమ్మ జయంతి, వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన, వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, పరశురామ ద్వాదశి, గౌతమ బుద్ధ, వ్యాస పౌర్ణిమ, అన్నమాచార్య జయంతి, అంతేకాకుండా సరస్వతీ నది పుష్కరాలు ఈ నెలలోనే ప్రారంభమయ్యాయని, 22వ తేదీ హనుమజ్జయంతి ఇలా ఎన్నో పవిత్రమైన రోజులు ఈ వైశాఖమాసంలో రావడం ఆ నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని గిరిప్రదక్షిణ చేయడం అత్యంత శుభప్రదమైన మాసంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిప్రదక్షిణ కమిటీ కోశాధికారి వలేటి కృష్ణారావు, శెనెగేపల్లి నాగాంజనేయులు, శనగపల్లి కిషోర్, గో సంఘం వాసు, పతంజలి శ్రీనివాస్, తుమ్మపూడి వెంకట సత్యనారాయణ లక్ష్మీ సువర్చల దంపతులు కార్యనిర్వహణ చేశారు.






