ప్రకాశం జిల్లా పరిధిలో లా & ఆర్డర్, నేరాలు & ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు బేస్తవారిపేట మండలం,సాలకళవీడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిక్క రామాంజనేయ రెడ్డి మరియు దొనకొండ మండలం, ఎర్రబాలెం గ్రామం చెందిన మోడీ ఆంజనేయులు అనే వ్యక్తిలు బుధవారం కనిగిరి పవిత్ర ఫంక్షన్ హాల్ లో జిల్లా ఎస్పీ గారికి అత్యాధునిక సాంకేతికత కూడిన డి. జె.ఐ. ఎయిర్ 3ఎస్ డ్రోన్ కెమెరాలను అందచేసినారు. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో పోలీస్ శాఖకు డ్రోన్ లను బహుకరించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డ్రోన్ లను బీవీ పేట మరియు దొనకొండ పోలీస్ స్టేషన్ లకు జిల్లా ఎస్పీ అందచేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో సాంకేతికత యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు, ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజిబుల్ పోలీసింగ్, వివిధ విఐపిల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందని, ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె నాగేశ్వరరావు, మార్కాపురం డిఎస్పి యు నాగరాజు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, త్రిపురాంతకం సీఐ అస్సాన్, కంభం సీఐ మల్లికార్జునరావు, బివి పేట ఎస్సై రవీంద్రరెడ్డి, దొనకొండ ఎస్సై త్యాగరాజు, ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


