హైదరాబాద్ జూన్ 1(జే ఎస్ డి ఎం న్యూస్)
హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా సాగిన విశ్వసుందరి 2025 పోటీలు ఘనంగా ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలెలో థాయ్లాండ్కు దేశానికి చెందిన “ఓపల్ సుచాట చుంగ్సీ” 72 వ ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్ 2025) గా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుంచి హాజరైన ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన ఓపల్ సుచాటకు 71వ విశ్వసుందరి క్రిస్టినా పిస్కోవా కిరీట ధారణ చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో మిస్ వరల్డ్ సి ఈ ఓ జూలియా మోర్లీ ప్రపంచ సుందరి విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విశ్వసుందరి ఓపల్ సుచాటకు అభినందనలు తెలియజేశారు. మిగతా కేటగిరీల విజేతలకు కూడా అభినందనలు తెలిపారు. “తెలంగాణ సంస్కృతి, వారసత్వం,చరిత్ర, విలువలు, ప్రపంచానికి చాటాం. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన సందర్శకులకు తెలంగాణ రైజింగ్ దార్శనికతను చూపించాం” అని ముఖ్యమంత్రి అన్నారు. చివరి దశలో ఖండాల వారిగా టాప్లో నలుగురు విజేతలుగా నిలవగా చివరి పోటీలో విశ్వసుందరి కిరీటం ఓపల్ సుచాటను వరించింది. ఈ 72 వ మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ నెల 7 వ తేదీన ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీల్లో వివిధ కేటగిరీల్లో అనేక దశల్లో విజేతలుగా నిలిచారు. ప్రపంచ సుందరి ఎంపిక అనంతరం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిసినట్టుగా ప్రకటించారు. పోటీకి హాజరైన కంటెస్టెంట్లు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించగా, హైదరాబాద్ ఆతిథ్యం అత్యద్బుతమని కంటెస్టెంట్లు ఆనందం వ్యక్తం చేశారు. “తెలంగాణ జరూర్ ఆనా” నినాదం ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది.


