బేగంపేట జూన్ 9 (జే ఎస్ డి ఎం న్యూస్):
మొక్కలు రాత్రికి రాత్రి కొట్టి అక్రమంగా తరలించి ఆప్రాంతంలో కొత్తగా మట్టిపోసి చదును చేసే మహానగరం (హైదరాబాద్ ) లో అత్యవసర పరిస్థితులలో తొలగించాల్సిన మహా వృక్షాలకు మరోచోట జీవం పోస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు. ఇప్పటికే నార్త్ జోన్ పరిధి లోని పలు ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయంగా మారిన చెట్లను తొలగించే ప్రక్రియకు అవసరైన అన్ని అనుమతులకు సొంత ఖర్చులతో చేస్తూ భారీ వృక్షాలకు మరో ప్రాంతంలో జీవం పోస్తూ వాటిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.మొక్కలపై తనకున్న మక్కువతో వృక్షాలను తొలగించే సమయం,వాటికి తిరిగి జీవం పోసే సమయం లో సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.ఒక వైపు విధి నిర్వహణలో బిజీ బిజీ గా వున్నప్పటికీ భారీ వృక్షాలకు జీవం పోస్తున్న శంకరరాజు మొక్కల కు ప్రాణ ప్రతిష్ట చేస్తున్న రారాజుగా పేరు తెచ్చుకున్నారు.ఈ మధ్య కాలంలో నార్త్ జోన్ పరిధిలో పలు వృక్షాలను ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా మరోచోటికి తరలించి పునరుజ్జీవం పోశారు.తాజాగా బేగంపేట టిటిఐ సమీపంలోని నాలాకు ఆనుకుని ఉన్న ప్యాట్నీ కాంప్లెక్స్ వద్ద అక్రమ ఆక్రమణలను తొలగించింది. ఈ సమయంలో ఒక అల్ల నేరుడు చెట్టు,ఒక రావి చెట్టు ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు.సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని రకాలైన అనుమతులు తీసుకున్న అనంతరం, ఈ రెండు చెట్లను వేటా ఫౌండేషన్ సహకారంతో విజయవంతంగా మరోచోటికి తరలింపజేశారు.అల్ల నేరుడు చెట్టు ను కంటోన్మెంట్ గ్రౌండ్ కు, రావి చెట్టు ను బైసన్ పోలో గ్రౌండ్ కు తరలించి వాటికి జీవం పోశారు.ఈ కార్యక్రమం లో కంటోన్మెంట్ బోర్డ్ సూపరిండెంట్ దేవేందర్, బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్, ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ అశోక్ రెడ్డి, మారేడుపల్లి ట్రాఫిక్ ఆర్ ఎస్ ఐ పి. శ్రీధర్లు ఉన్నారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు మాట్లాడుతూ పునఃస్థాపించబడిన చెట్ల పెరుగుదలపై పర్యవేక్షణ కొనసాగించబడుతుందన్నారు. అవి తమ కొత్తవాతావరణంలో ఆరోగ్యంగా ఎదగాలన్న ఉద్దేశంతో, అన్ని రకాలైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు.

