విద్యార్థి దశలో ఉన్నప్పుడే భవిష్యత్తులో తమకు లభించే ఉద్యోగ, వృత్తిపరమైన అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
చెప్పారు. ఈ దిశగా ‘ ఉజ్వల భవిష్యత్తు ‘ పేరుతో విద్యార్థులకు అవగాహన కల్పించేలా ” రూట్ టు రైజ్ త్రైవ్ ఫౌండేషన్ ” మరియు జిల్లా బాలల వనరుల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… సమాజంలో జరుగుతున్న మార్పులను నిరంతరం గమనిస్తూ ఉండాలని విద్యార్థులకు సూచించారు. పాఠాలతో పాటు పాఠ్యాంశేతర విషయాల్లోనూ విద్యార్థులు రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ కెరియర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ల స్థాయిలోనూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
కాగా, వివిధ రంగాలలో అందుబాటులో ఉండే ఉద్యోగ అవకాశాలను తెలియజేసేలా ఏర్పాటుచేసిన స్టాల్స్ ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఆయా విషయాలను వీటి నిర్వాహకులు ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. ఇంజనీరింగ్ , వైద్య , ఆర్థిక, న్యాయ, భారత నావికాదళం, పోలీసు, రైల్వే విభాగాల స్టాల్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన విభాగం వారు వివిధ పరికరాలతో
ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహారపు అలవాట్ల పైనా ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ పి.డి. సువర్ణ, జిల్లా ఉప విద్యాధికారి చంద్రమౌలేశ్వర్, డిసిపిఓ దినేష్ కుమార్,
బంగారు బాల్యం జిల్లా నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ, రూట్ టు రైజ్ త్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రషీద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు,
ఇతర అధికారులు పాల్గొన్నారు.

