హైదరాబాద్ జూన్ 17(జే ఎస్ డి ఎం న్యూస్)
దక్షిణ మధ్య రైల్వే రైళ్లపై
రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్లపై ప్రమాదకారక వస్తువులను ఉంచడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భంగం కలుగుతుంది మరియు రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి కార్యకలాపాలు క్రిమినల్ నేరం మరియు నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కఠినమైన చర్యలు తీసుకుంటారు, దీనికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
రైల్వే రక్షక దళం(ఆర్.పి.ఎఫ్) భవిష్యత్తులో ఇటువంటి సంఘ వ్యతిరేక సంఘటనలను నివారించడానికి, దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా అనేక చర్యలను తీసుకుంటోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వేలో 2025 సంవత్సరంలో జనవరినెల నుండి మే వరకు, రైళ్ల పై 128 రాళ్ల దాడి కేసులు నమోదుచేయబడినాయి. వీటిలో 85 కేసులు గుర్తించబడి 102 మంది నేరస్థులను అరెస్టు చేశారు. ఈ కేసులన్నీ సంబంధిత న్యాయస్థానాల్లో విచారణ చేయబడ్డాయి. ఇందులో ఇప్పటివరకు 12 మందిని దోషులుగా నిర్ధారించగా , అందులో 01 నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష మరియు మిగిలిన 11 మంది నిందితులకు రూ. 30,500 జరిమానా విధించబడింది. ఇంకా, రైల్వే పట్టాలపై ప్రమాదకారక వస్తువులను ఉంచిన 29 కేసులు నమోదుచేయగా, వీటిలో 26 కేసులు గుర్తించబడి 33 మంది నేరస్థులను అరెస్టు చేశారు. అన్ని కేసులు సంబంధిత న్యాయస్థానాలలో విచారణలో ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకు రైల్వే అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలియజేశారు. ఇలాంటి చర్యలను ఎదుర్కోవడంలో రైల్వేకు సహకరించాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి చర్యలు ప్రయాణీకుల భద్రత, విలువైన జాతీయ వనరులను కోల్పోవడంతో పాటు వారి భవిష్యత్తుపై శాశ్వత ప్రభావాన్ని చూపే ప్రతికూల పరిణామాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

