ఈవ్టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారిపై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒంగోలు టౌన్ పరిధిలో ముఖ్యమైన కూడలిలు, కళాశాలలు/పాఠశాలలు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఈవ్ టీజింగ్ చేస్తున్న 24 కొంతమంది యువకులను గుర్తించి వారికి శనివారం ఒంగోలు డిఎస్పీ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ యువతులు, మహిళలపై ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఈవ్ టీజింగ్ కేవలం సరదాగా చేసే చర్య కాదని, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందన్నారు. మహిళలు/విద్యార్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వెంబడించడం, అసహజ వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమన్నారు. ఈవ్ టీజింగ్కు పాల్పడిన యువకులకు దాని పర్యవసానాల గురించి, భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో కూడా వారికి వివరించారు. ఈవ్ టీజింగ్ చట్టరీత్యా నేరమని ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. యువతరం బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించడం, వారి హక్కులను గుర్తించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఈవ్ టీజింగ్ వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు.
రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు మాడిఫైడ్ సైలెన్సర్లతో అధిక శబ్దం చేస్తూ టౌన్ లో తిరుగుతున్నారని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, రాత్రి సమయంలో తిరిగే వారిలో కొంతమంది కాలేజీ విద్యార్థులు ఉన్నారని, కాలేజీ యాజమాన్యం వారు కాలేజీ హాస్టల్ వార్డెన్ల ద్వారా వెరిఫై చేసుకోవాలని డీఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా కోరారు.
మహిళలు ఏమైనా వేధింపులు ఎదురైతే వెంటనే స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేదా డయల్ 112/100 కాల్ చేయాలని సూచించారు.
ఈ కౌన్సిలింగ్ లో ఒంగోలు తాలూకా సీఐ విజయ కృష్ణ, టౌన్ ఎస్సైలు సాంబ శివరావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, సువర్ణ, రవణమ్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

