ఈవ్టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ఈవ్ టీజింగ్ కి అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఒంగోలు టౌన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, కాలేజీలు, పాఠశాలల వద్ద పోలీసు బృందాలు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఈవ్ టీజింగ్ పాల్గొన్న 40 మంది యువకులను గుర్తించి, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు ఈవ్ టీజింగ్ వల్ల వచ్చే నష్టాలు, భవిష్యత్తుపై ప్రభావం, చట్టపరమైన చర్యల గురించి వివరించారు.
ఈ సందర్బంగా ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ… మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వెంబడించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని తెలిపారు.ఈవ్ టీజింగ్ వలన వ్యక్తిగత మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంటాయని, ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు. యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
అలాగే రాత్రి సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, అధిక శబ్దంతో మాడిఫైడ్ సైలెన్సర్లు వాడుతూ బైక్ రేసులు నిర్వహించే ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం రాత్రి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 20 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 12 వాహనాలు డ్రంకెన్ డ్రైవింగ్, మిగిలిన 8 ట్రిపుల్ రైడింగ్ మరియు రాష్ డ్రైవింగ్ కేసులలో సీజ్ చేయబడ్డాయి.
ఈ స్పెషల్ డ్రైవ్ లో డిఎస్పీ ఒంగోలు ఆర్.శ్రీనివాసరావు , ఒంగోలు తాలూకా సీఐ విజయ కృష్ణ, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ఒంగోలు 2 టౌన్ సిఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సైలు సాంబ శివరావు, ఫణిభూషణ్, ఫిరోజ్, పున్నారావు, అజయ్, నాగమల్లేశ్వరరావు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

