హైదరాబాద్ జులై 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రుతుపవనాల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ బుధవారం జోన్ వ్యాప్తంగా చేపడుతున్న రుతుపవనాల సంసిద్ధత మరియు భద్రతా చర్యలపై సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్ర వాల్ మరియు ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్లలోని ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి ఆర్ ఎం లు) / అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు మరియు డివిజనల్ ఇంజనీర్లు (ఏ డి ఆర్ ఎంలు) కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సమీక్షా సమావేశంలో వంతెనలు, సొరంగాలు వంటి గుర్తించబడిన కీలక విభాగాలలో చేపట్టిన భద్రతా చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అత్యవసర పరికరాల లభ్యత మరియు ఇసుక, రాళ్లు మరియు పైపులు వంటి అవసరమైన వస్తువుల నిల్వలను ఆయన సమీక్షించారు. ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలు మరియు వంతెనలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని మరియు 24/7 పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏవైనా మరమ్మతు పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
నీటి వరదకు గురయ్యే అవకాశం ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జిల వద్ద ముందస్తు చర్యలలో భాగంగా చేపట్టిన భద్రతా చర్యలను జనరల్ మేనేజర్ సమీక్షించారు. లిఫ్టింగ్ బారియర్, డ్రైనేజీ పనులు, హెచ్చరిక బోర్డు ఏర్పాటు, నీటి పంపింగ్ ఏర్పాట్లు, 24×7 వాచ్మెన్ నిఘా వంటి జాగ్రత్తలను ఆయన పరిశీలించారు. సురక్షితమైన పని విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని, రైలు కార్యకలాపాలకు సంబంధించిన రికార్డు లను సక్రమంగా సరైన విధానంలో నిర్వహించాలని మరియు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపట్టాలని ఆయన అధికారులు మరియు సిబ్బందికి సూచించారు.
సూపర్ వైజర్ లు క్షేత్ర స్థాయిలో జరిగే కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని మరియు ఏదైనా సమస్య ఉత్పన్నమైనచో తక్షణమే పరిష్కరించాలని జనరల్ మేనేజర్ పేర్కొన్నారు. సమూహ సమావేశాలు మరియు వ్యక్తిగత కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా భద్రతకు సంబందించిన సిబ్బందిని క్రమం తప్పకుండా అప్రమత్తం చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.



