ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక హామీలను అమలు చేసిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా సరే.. ప్రజా సంక్షేమం కోసం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరో వైపు వైసీపీ నేతలు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో కూటమి ప్రభుత్వం పై బురద జల్లుతున్నారని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి… సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఏలూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి… ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గత 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. పేదలకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ ను వెయ్యి పెంచడానికే జగన్ కు ఐదేళ్లు పట్టిందని… రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఉన్న ప్రేమకు ఇంతకంటే నిదర్శనమేమి కావాలని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. రోడ్డుపై వెళ్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే… ఎవరైనా ఆగి బాధితులకు సహాయం చేస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత పార్టీ కార్యకర్త… తన కారు కింద పడి నలిగి పోయినా…. బాధ్యత లేకుండా క్షతగాత్రుడిని రోడ్డు పక్కన పడేసి, అతని మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక రాష్ట్ర ప్రజలపై బాధ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
*ఒకే ఒక్క సంతకంతో….*
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి నూతన అధ్యాయం మొదలయ్యిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒకే ఒక సంతకం పెట్టి… రూ.3 వేల పెన్షన్ ను నాలుగు వేలకు పెంచారని తెలిపారు. దివ్యాంగులకు రూ.10,000, శాశ్వతంగా మంచానికే పరిమితమైన రోగులకు నెలకు రూ.15,000 అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 64 లక్షల పెన్షనర్ల కోసం ఏడాదికి రూ.34,000 కోట్ల ఖర్చు చేస్తున్నామన్నారు. అదే విధంగా 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో వారి బంగారు భవిష్యత్ కోసం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు గొట్టిపాటి వివరించారు. అర్హులైన మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అదే విధంగా లోకేష్ పాదయాత్ర సందర్భంగా యువతకు ఇచ్చిన మాట కోసం త్వరలోనే 16,300 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు… రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14,000 కలిపి అందిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా…, సంక్షేమ పథకాలు అమలవుతున్నా… వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని… ప్రజలు కూడా వీటిని గమనించాలని మంత్రి గొట్టిపాటి కోరారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా… మార్కాపురం మున్సిపాలిటీకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరుపున కేటాయించిన రెండు చెత్త తరలించే ట్రాక్టర్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.


