ప్రకాశం జిల్లా పరిధిలో లా & ఆర్డర్, నేరాలు నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు ఒంగోలు, శ్రీ ప్రతిభా విద్యా సంస్థ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కి అత్యాధునిక సాంకేతికత కూడిన డ్రోన్ కెమెరాను అందచేసినారు. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ ను బహుకరించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ డ్రోన్ ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ కృష్ణకి జిల్లా అందచేశారు.
జిల్లాలో నేరాలను నియంత్రించే చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు నియంత్రణ, జూద కార్యకలాపాలు మరియు బహిరంగ మద్యపానం ఎక్కడ జరిగినా డ్రోన్ టెక్నాలజీతో పసిగడతామని, ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని, పోలీసులకు ఒక “డేగ కన్ను” లాగా ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను కఠినంగా ఎదుర్కొంటామని, ప్రజల సహకారంతో నేర నియంత్రణ మరింత సమర్థంగా నిర్వహించగలమన్నారు.
జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో సాంకేతికత యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదని, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు, ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో చైన్ స్నాచింగ్స్, ఈవ్ టీజింగు, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను, తోటలు, బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజిబుల్ పోలీసింగ్, వివిధ విఐపిల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందని, ముఖ్య కూడళ్ళలో ట్రాఫిక్ నియంత్రణ, సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ప్రతిభ విద్యాసంస్థల డైరెక్టర్లు నల్లూరిసీతారామాంజనేయులు నల్లూరి జయప్రకాష్ నారాయణ ప్రిన్సిపాల్ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
