గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రంలో చేపట్టిన చర్యల్లో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్ , జీఆర్పీ సిబ్బంది, మరియు మాదకద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో భాగంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.
పూరి ఎక్స్ప్రెస్ లో మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు . ఐదుగురు అనుమానితుల వ్యక్తులను అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు నిమిత్తం జి ఆర్ పి పోలీసులకు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం ముఖ్య ఉద్దేశం. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే *టోల్ ఫ్రీ నంబర్ 1972*, *డయల్ 112*, లేదా పోలీస్ *వాట్సాప్ నంబర్ 9121102266* కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.
ఈ తనిఖీల్లో ఎస్సైలు ఆంజనేయులు, శ్రీకాంత్, మధుసూదన్ రావు, చెంచయ్య, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు, ఈగిల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.




