ఆపదలో ఉన్న బాధితులను అదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి
అన్నారు.
గురువారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 121 మంది లబ్ధిదారులకు రూ.60.77 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వీటితో పాటుగా బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కూడా బాధితులకు మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొండపి నియోజకవర్గంలో 631 మంది లబ్ధిదారులకు రూ.5.73 కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు. పేదలకు ఆరోగ్య పరంగా ఆర్థిక తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా సిఎం సహాయ నిధి నుండి 450 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆగష్టు 15 న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు విరివిగా పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రజలకు సూచించారు.
అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జరుగుమల్లి మండలం, చతుకుపాడు గ్రామంలోని తారక రామ సి.హెచ్.సి గ్రూపుకు కిసాన్ డ్రోన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి స్వయంగా కిసాన్ డ్రోన్ ను ఆపరేట్ చేసి డెమో కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్ డ్రోన్ యూనిట్ విలువ రూ.9.80 లక్షలు కాగా, ఇందులో రూ. 7.84 లక్షలు సబ్సిడీ పోనూ, గ్రూప్ వాటాగా రూ.1.96 లక్షలు అని మంత్రి వివరించారు.


