విద్యార్థులకు బోధనతో పాటు పాఠశాలల్లో వారి భద్రతకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంతమంది విద్యార్థులకు బర్త్ సర్టిఫికెట్లు లేవో గుర్తించాలని డీఈఓ కిరణ్ కుమార్ కు చెప్పారు. మండల స్థాయిలో తహసిల్దార్లు, ఎంఈఓ లు సమన్వయంతో ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలన్నారు. తరగతి గదులలో పైనుంచి పెచ్చులు ఊడి పడటం, శిథిలావస్థకు చేరటం లాంటి పరిస్థితి ఎక్కడ ఉందో గుర్తించి వాటిని బాగు చేసేందుకు అవసరమైన నిధుల అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ‘ మనబడి – మన భవిష్యత్తు ‘ పథకంలో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. తల్లికి వందనం పథకంలో భాగంగా లబ్ధిదారుల ఈ- కేవైసీ, టీచర్ల బయోమెట్రిక్ హాజరు, మన జిల్లా నుంచి మైగ్రేట్ అవుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులపై చేపట్టిన వివిధ క్రమశిక్షణ చర్యల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేసే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకాడ వద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతలో రాజీలేదని తేల్చి చెప్పారు. ఇంటర్మీడియట్లో నమోదైన విద్యార్థులు, వారి పురగతి పైనా కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సమావేశంలో ఆర్ఐఓ ఆంజనేయులు, జిల్లా డిప్యూటీ విద్యాధికారులు ఎం.శ్రీనివాసులు, చంద్రమౌళీశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు.

