హైదరాబాద్ జులై 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ నగరం ఎంతోప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్,ఆదేశించారు. ఈ నెల 16 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ పండుగను భక్తులు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ వేదికగా.. గోల్కొండ, బల్కంపేట,సికింద్రాబాద్ ఉజ్జయిని
మహంకాళి, లాల్ దర్వాజ తదితర ఆలయాల్లో జరిగే బోనాల ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న భద్రతా చర్యలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్,మాట్లాడుతూ గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో రాబోయే 15 రోజులు అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఆయా ఆలయాల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు భద్రతా చర్యలుచేపట్టాలన్నారు. హైదరాబాద్ ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తుల భద్రత విషయంలో జారీ చేసిన ఆదేశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మంత్రుల ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులందరూ అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలుతీసుకోవాలని స్పష్టం చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీమ్స్ తో పాటు స్థానిక పోలీసులను భారీగా మోహరిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఆలయాల పరిసరాల్లో పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు.బోనాల ఉత్సవాలకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలోతరలివస్తారని, వారి భద్రతకు హైదరాబాద్ సిటీ పోలీస్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. గత ఉత్సవాల్లోమహిళలను వేధించిన 644 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈసారి కూడా షీ టీమ్స్ ద్వారా నిరంతర నిఘాకొనసాగించాలన్నారు. గొలుసు దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్, జేబు దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలకు ఆస్కారం లేకుండా నివారణా చర్యలుచేపట్టాలన్నారు.దేవాలయాల పరిసరాల్లో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపు వంటి క్రతువులు శాంతియుతంగా సాగేలా తగినంత మంది సిబ్బందిని రంగంలోకి దించాలన్నారు. గత పండుగల తరహాలోనే ఈ బోనాల మహోత్సవ బందోబస్తును కూడా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఐసీసీసీ నుంచి అదనపు సీపీ (లా అండ్ ఆర్డర్ సౌత్ రేంజ్ ) తఫ్షీర్ ఇక్బాల్, డీసీపీ (అడ్మిన్) వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ ఎస్బీ నర్సింహారావు,అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు, ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, ఐపీఎస్ తో పాటు అన్ని జోన్ల లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.


