ప్రకాశం సెప్టెంబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఏదైనా సంఘటన జరిగినప్పుడు, దానికి సంబంధించిన అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి సంఘటనలకు వెళ్లాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సూచించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా స్పందించడం వల్ల అనవసర సమస్యలు, గందరగోళం తలెత్తే అవకాశం ఉందని, అన్నారు.జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 10వ తేదీన మౌలాబి అనే మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుని హైదరాబాద్లో మృతి చెందిన దురదృష్టకర సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సింగరాయకొండ చైతన్య నవోదయ పాఠశాలలో తౌషిక్ అనే 11 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై అప్పటి నుంచి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో అనేక మందిని విచారించి, వివిధ కోణాల్లో పరిశీలిస్తూ, పారదర్శకంగా పూర్తి జవాబుదారీతనంతో ప్రతి అంశంపై సమగ్ర వివరాలను సేకరించినట్లు తెలిపారు. ప్రతి అడుగులోనూ ఎటువంటి దాపరికం లేకుండా తల్లిదండ్రులకు తెలియచేయటం ,దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తును స్థానిక ఎస్సైకి కాకుండా కందుకూరు సబ్ డివిజన్ సీఐ స్ధాయి అధికారికి అప్పగించామ న్నారు.దర్యాప్తులో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాల పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులను విచారించి,
వారి స్టేట్మెంట్లను రికార్డు చేశామని తెలిపారు.
తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు కోర్టుకు హాజరై, కేసు దర్యాప్తులో ఇప్పటివరకు చేపట్టిన విచారణ, దర్యాప్తు చర్యలు, జరిగిన పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేశామని వివరించారు.హై కోర్ట్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు నిమిత్తం నెల్లూరు అడిషనల్ ఎస్పీ ని ప్రత్యేకంగా నియమించడం జరిగిందని, దర్యాప్తులో భాగంగా సెల్ఫోన్లు, సీసీ కెమెరాల ఫుటేజీ తదితరాలను స్వాధీనం చేసుకుని పరిశీలించాలన్నారు.
అలాగే సంఘటన జరిగిన ప్రదేశంలో ఎఫ్ఎస్ఎల్ సిబ్బందితో శాస్త్రీయ ఆధారాలను సేకరించామ న్నారు.దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో తౌషిక్ తల్లి ధర్నా చేయడంతో పాటు, పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భాల్లో పోలీసులు, అధికారులు ఆమెకు మనోధైర్యం కల్పించి, కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు ఎస్పీ వివరించారు.ఆమె తరచూ పాఠశాలకు వెళ్లి మాట్లాడటం వల్ల అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో అసౌకర్యం తో పాటు ఆందోళన కలిగే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భాల్లో పోలీసులు వెంటనే ఆమెను రక్షించి, మానసికంగా ధైర్యం కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాబు తల్లిదండ్రులు తీవ్ర మానసిక సంఘర్షణలో ఉంటారని, వారు అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేమని అన్నారు.
సంఘటన జరిగిన సమయంలో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా పాఠశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడం జరిగిందని, ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకుని పోలీసులు సంయమనంతో వ్యవహరించారని వివరించారు.తౌషిక్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సుమారు 70 మంది విద్యార్థులను విచారించి, వారి స్టేట్మెంట్లను రికార్డు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను కూడా విచారించి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.కనిగిరిలో భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించడం జరిగిందని తెలిపారు.
ఆమె మానసిక ఆందోళన చెందుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచి, మానసికంగా ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలోఇష్టానుసారంగా వార్తలు ప్రచారం
చేయించడం, ఏదో ఒక సంఘటన జరిగినట్లు చూపించే ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో అనుకోని పరిణామాలు ఎదురై అవకాశం ఉందని జాగ్రతవ్యవహరించాలన్నారు. బయట ఈ సంఘటనపై ప్రజా సంఘాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్న విషయాలపై స్పందిస్తూ, పూర్తి వివరాలు, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం, వార్తలను ప్రచురించడం సరైన పద్ధతి కాదన్నారు.ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. స్కూల్ సంబందించిన వివరాలు హైకోర్టులో ఉందని, పూర్తీ సమాచారం విద్యాశాఖ వద్ద ఉంటుందని తెలిపారు.ఈ కేసులో ప్రతి అంశాన్ని పోలీసు అధికారులు నిపుణులతో పరిశీలన చేయించి, లోతుగా విశ్లేషించి దర్యాప్తు చేపట్టారని తెలిపారు.ఇది అత్యంత సున్నితమైన సమస్య అని, ఆత్మహత్యకు ప్రయత్నించిన తౌషిక్ తల్లి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన అని జిల్లా ఎస్పీ అన్నారు.

